జై శ్రీ వీరమ్మ తల్లి

పూర్వము, సుమారుగా 200 సం క్రితం, కర్ణాటక రాస్ట్రం, విజయనగర సంస్థానాధీశులు, కృష్ణదేవరాయలు ఆస్థానము నందు, చిత్ర కళాకారుడు, చిత్తర్వు బిరుదాంకితులు, చిత్తర్వు వెంకోజి గారు, సంస్థానం పతనమయిన పిమ్మట, వారు మామిడికోళ్ళ గ్రామానికి వలస వచ్చినారు (సుమారుగా 6 తరముల క్రింద). వారు కరకట్ట కాంట్రాక్ట్ లు బ్రిటిష్ వారి హయాములో చేసుకొనుచు, సంపాదించుకొనుచు, తోడు కోసం, పెరిసేపల్లి గ్రామము నుండి, తోట వారిని తీసుకుని వచ్చినారు. చిత్తర్వు వారు 1911 వ సం నుండి 1918 వ సం వరకు మేడ కట్టుకుని, తోట వారు మండువ లోగిలి కట్టుకుని ఉంటూ ఉండేవారు.

ఈ మామిడికోళ్ళ గ్రామము, కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలము నందు, పామర్రు నుండి గుడ్లవల్లేరు వచ్చు పుల్లేరు కాలువ గట్టు ప్రక్కన, గుడ్లవల్లేరు నుండి 4 కిమీ దూరమున ఉన్నది. మరియు ఇటుగా వయా లంకాదొడ్డి గ్రామము మీదుగా డోకిపర్రు వేంకటేశ్వర స్వామి గుడి (7 కిమీ) నకు రోడ్డు అనుసంధానమై ఉన్నది.

మామిడికోళ్ళ గ్రామ పెద్దలు చెప్పిన ప్రకారము, శ్రీ వీరమ్మ తల్లి గత 115 సంవత్సరములుగా మామిడికోళ్ళ గ్రామము నందు వెలసియున్నది. శ్రీ తోట భద్రయ్య (దేవుడు భద్రయ్య) గారు అను మామిడికోళ్ళ గ్రామ వాసి పనుల నిమిత్తము మామిడికోళ్ళ ప్రక్క గ్రామము అయిన పెరిసేపల్లి గ్రామము నకు వెళ్ళి వచ్చుచున్నపుడు (సుమారుగా 1910 సం న) ఆయన 15 సం వయసు నందు శ్రీ వీరమ్మ తల్లి ఆవహించినది అనియు, ఆయన లంకాదొడ్డి గ్రామము దాటుచున్నపుడు స్పృహ తప్పి, గుడిసె ఇంటి పేరు గల వారి (పెద్ద గోవిందు, చిన్న గోవిందు) ఇంటి ముందు పడి పోయినాడు అనియు, వారు ఇంట్లోకి తీసుకుని వెళ్ళి సపర్యలు చేసి నపుడు, దేవుడు భద్రయ్య గారు లేచి, నన్ను శ్రీ వీరమ్మ తల్లి ఆవహించి యున్నది అని చెప్పి, ఆ పూనకము నందు నన్ను (శ్రీ వీరమ్మ తల్లి) మామిడికోళ్ళ గ్రామమున ప్రతిష్టించమనియు, మరియు పుట్టినిల్లు వారిగా మీరు నాకు అన్ని ఆడపడుచు నకు జరుగు అన్ని కార్యక్రమములు మీ ఇంటి నుండి చూడమని ఆదేశించినది అనియు, కాలక్రమమున దేవుడు భద్రయ్య గారు ఇప్పుడు ఉన్న గుడి ప్రదేశమున ఉన్న ఇంటి నందు కాపురము ఉంటూ శ్రీ వీరమ్మ తల్లి భక్తులకు బండారి, తాళ్ళు శ్రీ వీరమ్మ తల్లికి వారి కోరికలు తీర్చమని నమస్కరించి భక్తులకు తగు సూచనలు ఇచ్చుచుండును.

లంకా దొడ్డి గ్రామ గుడిసె ఇంటి గల వారు అమ్మ వారి దగ్గరకు వచ్చి, వారు మేము పుట్టినింటి వారుగా తగు కార్యక్రమములు చేయ లేక పోయి వున్నామని మమ్ములను అనుగ్రహించమనియు వేడుకొనగా, తల్లి పూనకము నందు మామిడికోళ్ళ గ్రామ కాపురాస్తులు తోట వారిని పుట్టినిల్లు గా మార్చమని ఆదేశించగా అప్పటి నుండి తోట రత్తయ్య గారు మరియు వారి కుమారులు తోట భద్రయ్య, పోతయ్య గార్లు అప్పటి నుండి ఇప్పటి వరకు (2024 సం) వారు, వారి వంశస్తులు నిరవధికంగా ప్రతి సంవత్సరము పుట్టినిల్లు నుండి సారె, ఒడిగంటి బియ్యము, పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పానకము, పాయసం మొదలగు ఇత్యాది ఆడపడుచు వస్తువులు శ్రీ వీరమ్మ తల్లి తో పాటు గద్దె వరకు వచ్చి సాగనంపుతూ వున్నారు. అదే విధముగా, లంకాదొడ్డి గుడిసె వారి (గత 3 తరములుగా, ప్రస్తుతం తాతబ్బాయి గారి) ఇంటి నుండి కూడా, పసుపు, కుంకుమ, కల్లు, పెరుగు, మజ్జిగ, వెన్నపూస, గోరింటాకు, మరియు పూలుతో కావడి లో తీసుకుని మామిడికోళ్ళ పుట్టినింటి వారితో కలిసి గద్దెకు వచ్చుదురు.

ఈ విధముగా జరుగుతున్నపుడు, దేవుడు భద్రయ్య గారు 1974 వ సం న వయసు రీత్యా 80 సం సుమారుగా వున్నపుడు పరమ పదించినారు. అనగా ఈ సం 2024 నాటికి ఆయన పరమ పదించి 50 సం పూర్తి అయినవి. దీని ప్రకారం, ఆయన సుమారుగా 1900 సం ముందు జన్మించి యున్నారు. మరియు సుమారుగా ఆయన 15 వ సం శ్రీ వీరమ్మ తల్లి ఆవహించినది అనగా 1910 వ సం నుండి ఆ దేవత మామిడికోళ్ళ గ్రామమున వుండి వున్నది అని గ్రామ పెద్దల అంచనా.

గ్రామ పెద్దల సమాచారం ప్రకారం, శ్రీ వీరమ్మ తల్లి పూనకము నందు ప్రతి సంవత్సరము శ్రీ రామ నవమి తరువాత వచ్చు శుక్రవారము సంబరాలు నిర్వహించమని చెప్పినందు వలన, పెద్దల ఊహ తెలిసిన నాటి నుండి ప్రతి సంవత్సరము ఆ విధము గానే తల్లి సంబరములు జరుగు చున్నవి.

సంబరాల విశేషాలు:

  • I. సంబరాల ముందు రోజు అనగా గురు వారము:

    ఈ రోజు ఉదయము నుండి చెరువు నుంచి 101 బిందెలు నీళ్ళతో (పాలాభిషేకముతో) శ్రీ వీరమ్మ తల్లి గద్దె మరియు గుడి శుభ్రము చేయుట (మ్రొక్కు కున్న వారు కూడా) మరియు 101 బిందెలతో మామిడికోళ్ళ గ్రామమున వెలసి ఉన్న గ్రామ దేవత గంగానమ్మ తల్లి తలంటు స్నానము చేయుంచుట జరుగును. శ్రీ వీరమ్మ తల్లి గద్దె అలంకరించుట మరియు ఆ వారం నందు గుడి బయట తాటాకు పందిరి గ్రామ వాసులచే వేయడం మొదలగు పనులు జరుగును.

  • II. సంబరం రోజున అనగా శుక్ర వారము:

    గ్రామ పెద్దల సమాచారం ప్రకారం, ఈ రోజు ఉదయం, అమ్మ వారికి, దేవుడు భద్రయ్య గారి వారసులు, డప్పులు, మేళాలతో తల్లికి, పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, దీపారాధన చేసి, నైవేద్యం పెట్టి, పూలాలంకరణ చేయుదురు. దేవుడు భద్రయ్య గారి ఇంటి నుండి పాలకావడి, చిలకలు, గాజులు, పసుపు, కుంకుమ, చీరలు తీసుకుని వచ్చుదురు.

    ఈ సంబరం రోజు అమ్మ వారు చెరువు రేవు లో స్నానం చేస్తూ ఓలలాడునపుడు, గుడిసె వారు మగ్గులతో నీళ్ళు పోసెదరు. తడి బట్టలతో అమ్మ వారికి పారాయణం చేసి, బొట్టులు పెట్టి, కాళ్ళకు గజ్జెలు కట్టి, చిలకలు (తల్లికి ప్రీతికరమయిన తీపి) ఎగురవేసి, పుట్టినింటి కి పోతు రాజు తో వచ్చును. వచ్చునపుడు, కాళ్ళు క్రింద పెట్టకుండా, చలువ బట్టలు వేసి తీసుకుని వచ్చుదురు. వచ్చునపుడు దారి నందు కోడి ని సుమారుగా ఊరి మేడ ముందు చూపెట్టి తీసుకుని వచ్చుదురు.

    పుట్టినింటి వారు, కాళ్ళు కడిగి, ఒడి బియ్యం కట్టి, చీర, జాకెట్ పెట్టి, బొట్టు పెట్టి , గాజులు తొడిగి, ఇంటిల్లి పాది దణ్ణం పెట్టుకుని (తల్లి, మమ్ములను, ఊరి ప్రజలను సుఖము గా చూడుమనీ, ఆశీర్వదించమని కోరి అమ్మ వారిని పంపుదురు ) సారె, పానకము, పాలు, తల్లికి ఇష్టమయిన చిలకలు (తీపి) కావడి తో పుట్టినింటి వంశస్తులు మరియు లంకాదొడ్డి గుడిసె వారు అందరూ అమ్మ వారితో గద్దె వరకు చలువ బట్టలు మీద నడుచుకుంటూ వచ్చి, అన్నియు ఇచ్చి కూర్చుండ బెట్టి కొబ్బరికాయ కొట్టి, సాంబ్రాణి వేసి, చిలకలు ఎగురవేసి, దణ్ణం పెట్టుకుంటారు. గద్దె దగ్గరకు వచ్చునపుడు, గంగానమ్మ తల్లి కి దణ్ణం పెట్టి, పోతు రాజు కు కొబ్బరి కాయ కొట్టుదురు. మరియు గద్దె నందు ప్రవేశించు సమయము నందు, నల్ల కోడి ని చూపెట్టి, చాకలి వానితో, దిష్టి తీసి లోపలికి వచ్చుదురు. ఆ తరువాత భక్తులు అందరూ దేవతను దర్శించుకుందురు. పుట్టినింటి వారు చేయు ఈ కార్యక్రమములు వీక్షించుటకు క్రింది వెబ్ సైటు ను చూడండి.

    ఆ రోజు సాయంత్రం, పోతు రాజు మరియు పంబళ వారు, చాకలి తో ముంత, ప్రమీదలు, మంచి నూనే, సాంబ్రాణి, దద్దోజనం, పరమాన్నం అన్నియును కావడి తో చాకలి తీసుకుని ఊరి బయట జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి, అన్నియును తెల్లటి వస్త్రము నందు పెట్టి, జమ్మి చెట్టు చుట్టూ కట్టి, దీపారాధన పంబళ వారు చేయుదురు. కాసేపటి తరువాత, అందరూ వెళ్ళి, పంబళ వారు చెప్పే కధ విని, ప్రసాదములు తీసుకుని గుడికి వచ్చుదురు. ఈ కార్యక్రమములు వీక్షించుటకు క్రింది వెబ్ సైటు ను చూడండి.
    ఆ రాత్రి, అన్నదానము నందు భోజనాలు అయిన తరువాత, 10 గం లకు, పుట్టి నింటి వారి స్థలము నుండి (ఈ రోజుల్లో ఎవరి ఇళ్ల నుండి వారి యొక్క) ఎడ్ల బండ్ల పై ప్రభ లు కట్టి (ఈ రోజుల్లో ట్రాక్టర్లు) దేదీప్యమయిన లైట్ లతో మరియు ఇష్టమయిన దేవుడి ప్రభ లతో అలంకరించ బడి, దేవుడు భద్రయ్య గారు (ఇప్పుడు పోతు రాజు కానీ దేవుడు భద్రయ్య గారి వారసులు కానీ) వచ్చి దేవుడి గారి బండి ముందు కొబ్బరి కాయ కొట్టి, అగరవత్తులు వెలిగించి, సాంబ్రాణి చల్లి, తల్లికి దణ్ణం పెట్టుకుని, పంబళ వారు నిమ్మ కాయ తీసిన తరువాత మొదటగా దేవుడు గారి బండి, బండి మీద దేవుడు భద్రయ్య గారు, తరువాత పుట్టినింటి వారి బళ్ళు, తరువాత ఊరి వారి బళ్ళ తో, ఊరేగింపు బయలు దేరును.
    ఊరేగింపు నందు, డప్పుల వారితో, కోలాటం చేయు వారితో, మైక్ సెట్టింగ్స్ తో కోలాహలంగా బయలుదేరి, గద్దె దగ్గరకు వచ్చును. దేవుడు భద్రయ్య గారు ఈ రోజు చీర కట్టుకుని, గద్దె నుండి అమ్మ వారి ఫోటో ను, తీసుకుని, బయటకు వస్తూ, గద్దె నందు తెచ్చి పెట్టుకున్న కర్రలు అందరకి ఇస్తూ వచ్చి, మొదటి బండి ఎక్కిన తరువాత, గద్దె నుండి బయలుదేరి, ఊరి చుట్టూ, ప్రతి వీధి తిరుగును. లంకాదొడ్డి గ్రామము గుడిసె వారి ఇంటినుండి ప్రభ రామాలయం, గంగానమ్మ గుడి మీదుగా ఊరి అంతయు తిరిగి మామిడికోళ్ళ ప్రభ బళ్లతో కలిసి, తిరుగును. ప్రతి ఇంటి దగ్గర ఆగి, ఆ ఇంటి వారు, కొబ్బరి కాయ కొట్టి, అగరవత్తులు వెలిగించి, పసుపు, కుంకుమ, వేపాకులు కలిపిన నీళ్ళు దేవుడు బండి ముందు వార పోసి, తల్లికి దణ్ణం పెట్టుకుందురు.
  • III. సంబరం మరుసటి రోజు అనగా శని వారము:

    ఉదయాన, శ్రీ వీరమ్మ తల్లి కి, దేవుడు భద్రయ్య గారి ఇంటి నుండి విజయవాడ తిరుమలశెట్టి వారు పాలకావడి, పసుపు, కుంకుమ, మొదలగునవి తీసుకుని గద్దె దగ్గరకు వచ్చును.
    పాళీ లు కట్టి న తరువాత, పంబళ వారు, తల్లి యొక్క కధ చెప్పుదురు. ఈ కధ చెపుతుండగా, గుడిసె వారు పసుపు, కుంకుమలతో ఓలలాడడం, దీపారాధన చేసి, పాలు పొంగించి, పాళీల దగ్గర పెట్టుదురు.
    ఊరి వారందరూ, వారి యొక్క పశువులను గుడి కి తీసుకుని వచ్చి, దేవుడు భద్రయ్య గారితో, మంత్రించిన బండారి ని వాటి మీద చల్లే వారు.

    శ్రీ దేవుడు భద్రయ్య గారు ఉన్న రోజులలో, ఆయన స్వయముగా ఒక పోతును పెంచి, ఈ శని వారము రోజున అమ్మ వారికి బలి ఇచ్చి, దానిని ఊరి ప్రజలకందరికి ఇంటింటికీ పంపే వారు. పుట్టినింటి వారికి, యార్ల వారికి మాత్రం, వారి ఇంట్లో భోజనాలు వుండేవి. ఆయన తరువాత, ఊరి వారు, విరాళములు సేకరించి, పోతులను కొని, పంచుకుని, వండుకొని అమ్మ వారి ప్రసాదం గా భుజింతురు.

గ్రామ పెద్దలు చెప్పిన ప్రకారం, ఎవరైనను సంబరం రోజున మ్రొక్కులు తీర్చుకోలేక పోయిన, ఏ కారణం చేత రాలేక పోయిన వారు, సంబరం శుక్ర వారం నుండి, నాల్గవ శుక్రవారం (నెల సంబరం అని పిలుచుదురు) రోజున, వారు గద్దె కు వచ్చి, వారి యొక్క మ్రొక్కులు తీర్చుకొంటారు. ఇది సంబరం రోజు తీర్చుకొను మ్రొక్కులతో సమానం.

మామిడికోళ్ళ గ్రామమున 2010 వ సం నందు శ్రీ వీరమ్మ తల్లి అన్న సమారాధన కమిటీ ఏర్పడి, శ్రీ వీరమ్మ తల్లి సందర్శించు భక్తులకు ఎంతమంది వచ్చినను ఆ రాత్రి భోజన సదుపాయం లేదని అనకుండా అన్నదానము (భక్తుల విరాళాల తో) చేయుచున్నారు. 1100 మందితో ప్రారంబించబడి ఇప్పటి వరకు (2020, 2021 మినహా, కరొన సందర్బంగా) అప్రతిహారంగా సుమారుగా 4000 మంది భక్తులు భోజనాలు చేయుట జరుగు చున్నవి.

ఈ క్రమమున 2022 వ సం నుండి, భక్తులకు ఉదయము అల్పాహారము, మధ్యానం భోజనము కూడా కమిటీ వారు భక్తుల విరాలము లతో సమకూర్చు చున్నారు. కావున, భక్తులు ఉదయము నుండి తల్లిని దర్శించుకుని భోజనాది సదుపాయములు ఉపయోగించుకొనవచ్చును. ఈ కార్యక్రమములు వీక్షించుటకు క్రింది వెబ్ సైటు ను చూడండి.

  • • మామిడికోళ్ళ మరియు లంకాదొడ్డి గ్రామములను కలరా లాంటి వ్యాధులు రాకుండా, దేవుడు భద్రయ్య గారు నిష్ట గా శ్రీ వీరమ్మ తల్లి ని కొలువుట (వేపాకు నెల పదిహేను రోజులు భుజించి)
  • • ప్రతి శుక్ర, శని వారములలో దేవుడు భద్రయ్య గారు శ్రీ వీరమ్మ తల్లి సందర్శనానికి వచ్చు భక్తులకు సఖినము ఉదయము 7 గం నుండి రాత్రి 8 గం వరకు ఏమియు తినకుండా (మజ్జిగ తీసుకుని) చెప్పుట. ప్రతి 30 మందిని కూటమి గా చేసి, గద్దె నందు సఖినం చెప్పే వారు.
  • • భక్తులు ఏది అయినను అనుకుని, పని జరిగిన తరువాత మ్రొక్కులు తీర్చుకుందురు.
  • • శుభకార్యముల ముందు, (ఇల్లు కట్టుకొనుట, పెళ్ళిళ్ళు జరుగుట) వచ్చి అమ్మ వారికి దణ్ణం పెట్టుకోవడం.
  • • చిన్న పిల్లల 21 రోజుల వుయ్యాల, 6 వ నెల 6 వ రోజు అన్న ప్రాసన గుడి నందు భక్తులు వచ్చి జరుపుకుందురు.
  • • ఓణీ, పంచె, పెళ్లిళ్లు, సత్యనారాయణస్వామి నోములు, రిసెప్షన్స్, పుట్టినరోజు మొదలగునవి శుభకార్యములు గద్దె దగ్గర జరుపుకొనుట
  • • పిల్లలు పుట్టని వారికి సంతాన ప్రాప్తి అయిన తరువాత పేరు కూడా వీర లేక వెంకట తో పెట్టుకుందురు.
  • • ఎవరైనను, క్రొత్తగా వివాహం చేసుకొన్న వారు, లేక క్రొత్తగా మంగళ సూత్రములు చేయుంచు కున్నవారు, వారి మంగళ సూత్రములు తీసి, ఆయన మెడలో వేసినపుడు, సఖినం అయిన తరువాత, ఎవరిది వారికి అప్ప జెప్పేవారు (తారు మారు అవకుండా).
  • • క్రొత్తగా ఏదైనా వాహనములు (లారీలు, ట్రాక్టర్లు, స్కూటీ లు, బైక్ లు, కార్ మొదలగునవి) కొన్నపుడు, వారు గద్దె దగ్గరకు తీసుకుని వచ్చి, పూజలు చేయించుకుని, బండారు చల్లించుకుందురు. మరియు వారి కోరికలు తీరినచో సంబరము రోజున ఊరంతయు ప్రభ బళ్ళతో పాటు తిప్పుదురు.
  • • భక్తులు శ్రీ వీరమ్మ తల్లి పై నమ్మకము తో వివిధ కారణములతో (ఆర్ధికము, ఆరోగ్య, సంరక్షణ మరియు ఏదైనా కుటుంబ సమస్యలు) తల్లిని దర్శించుకుని, ఆ యొక్క భాదలు తీర్చమనీ వేడుకుందురు.
  • • శ్రీ వీరమ్మ తల్లి దేవత గా చాలా శక్తి కలిగి వుండి, ఆ తల్లి భక్తులను వారి దురదృష్టముల నుండి, దుష్టశక్తుల నుండి సదా కాపాడును.
  • • భక్తులు, వారికి గాని, వారి పిల్లలు, కుటుంబం లో వారికి గాని ఏదైనా అంటు వ్యాధులు (పొంగు, మసూచీకము, అలెర్జీ లు) వచ్చినపుడు, తల్లిని దర్శించుకొనుట లేక ఊరివారందరు అనుకోని మ్రొక్కుకుని ముడుపులు కట్టుట జరుగును.
  • • తల్లి గ్రామ దేవతగా ఊరిని తుఫానులు రావడం వలన జరుగు నస్టములు లేకుండా, సమయానికి వర్షము వచ్చి పంటలు బాగా పండడం, వ్యాధులు రాకుండా కాపాడుట (కరొన సమయమున, మామిడికోళ్ళ గ్రామమున ఎవరు ఈ వ్యాధి వలన చనిపోలేదు) చేయును.
  • • పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయుట, అన్నప్రాసన పెట్టుట, అక్షరాభ్యాసం చేయుంచుట మొదలగునవి.
  • • పంట ఏదైనను (ధాన్యం, మినుములు మొదలగునవి), మొదటి బస్తా లేక కొంత అమ్మవారికి సమర్పించుకుందురు. మరియు గేదెలు, ఆవులు ఈనినపుడు, మొదటి పాలు అమ్మ వారికి ఇచ్చుదురు.
  • • విదేశీయానము చేయ దలచిన వారు, తల్లి దగ్గరకు వచ్చి, వారి వీసాల గురించి మ్రొక్కుకొనుట.
  • • అయ్యప్ప భక్తులు శబరిమలై వెళ్ళు ముందు, తిరుపతి వెళ్ళునపుడు, ఒకసారి తల్లి ని దర్శించుకుని వెళ్ళుట.

దేవుడు భద్రయ్య గారి వంశస్థులు రోజు క్రమం తప్పకుండా

  • • శ్రీ వీరమ్మ తల్లి కి దూప, దీప, నైవేద్ధ్యం పెట్టుట.
  • • బయట ఊరి భక్తులు వచ్చిన యెడల వారికి ఆహ్వానించి, వారు చేయు పూజ కార్యక్రములకు (పాలు పొంగించుకొనుట, పాల పొంగుళ్ళు చేయుట, కొబ్బరి కాయ కొట్టుట, పసుపు, కుంకుమ పెట్టుట, కోడి, మేక, పొట్టేలు ను బలి యిచ్చుట మొదలగునవి, ఎవరు అనుకొన్నవి వారు చేయుదురు) తోడ్పాటు
  • • పొయ్యి, గ్యాస్, వంట పాత్రలు, కుర్చీలు మొదలగునవి సమకూర్చుట
  • • శ్రీ వీరమ్మ తల్లి బండారి, తాళ్ళు ఇవ్వడం

ఊరి నందు ఏదైనా తీరని అవాంతరములు వచ్చిన, గ్రామ వాసులు, తల్లికి మ్రొక్కుకొని, ముడుపులు ఊరినందు ఉన్న రావి చెట్టుకు కట్టి, ఒక పంది పిల్లని తీసుకొని వచ్చి, ఊరి నందు వదులుదురు. అవాంతరము తీరిన సంవత్సరము లోపు గాని, 3 వ సం గాని, సంబరం ముందు రోజు రాత్రి, ఆ పంది ని తల్లికి బలి ఇచ్చి, ఆ పంది తలను ఊరి పొలిమేర చుట్టూ కర్రలతో మోత చేసుకుంటూ, తిప్పుదురు. ఆ విధముగా తల్లి మ్రొక్కుబడి తీర్చుకుందురు. దీనిని నడి వీధి జాతర అందురు.

వూరి పొలిమేర సమాచారము:

ఊరి వంతెన దాటిన తరువాత, మునియ్య చేను దగ్గర నుండి, పంట కాలువ గట్టు మీదుగా, వెంకట్రావ్ గారి చేను దగ్గర, కాలువ దాటి, వారి గట్టు మీద నుంచి, పండు (తోట మోహన్ రావు) గారి చేను మీద నుంచి, నక్కలపొద గట్టు మీద నుండి, కొంగుర మడి గట్టు మీద నుండి, లంకాదొడ్డి చెరువు నుండి, కుడి చేతి వైపు కు తిరిగి, శివ రావు గారి 10 యకరాలు గట్టు మీద నుండి, కొవ్వలో వీర భద్రయ్య గారి చేను దగ్గర, డోకిపర్ర్ కాలువ మీదుగా, డ్రాపులు దగ్గర, బోనేడుపాలెం రోడ్డు పుల్లేరు గట్టు వరకు, మామిడికోళ్ళ పుల్లేరు రేవు వరకు వచ్చి, మునియ్య చేను దగ్గరకు.

శ్రీ వీరమ్మ తల్లి పూనకం నందు, ఊరిని కాపాడుటకు శక్తి కావలెననియు, దానికి పుట్టినింటి వారు వినాయకుడుని, తల్లి గుడి నందు ప్రతిష్టించమనియు చెప్పియుండిన, తోట వంశస్తులు ఆమె కోరిక మేరకు వినాయకుడిని ప్రతిస్టించినారు.

శ్రీ వీరమ్మ తల్లి గుడి కట్టి, 100 సం దాటిన సందర్బమున, ఊరి ప్రజలు, కమిటీని ఏర్పాటు చేసుకుని, నూతన గుడి అమ్మ వారికి (గుడి పునః నిర్మాణం) కట్టించటము జరుగు సందర్బంగా, 10-ఆగస్టు-2024 న గం 9.26 ని లకు శంకుస్థాపన భక్తుల విరాళములతో చేయడం జరిగినది. విరాళముల సమాచారం, కమిటీ వారు ఎప్పటికప్పుడు వాట్సప్ ద్వారా తెలియ పరచడం జరుగు తున్నది.

కావున శ్రీ వీరమ్మతల్లి గుడి పునః నిర్మాణం నకు దాతలు విరాళములు ఇవ్వడానికి, బ్యాంక్ ఖాతా నెంబర్ మరియు క్యూ. ఆర్. కోడ్ సమాచారము:
ఎవరైనను, ఎంత మొత్తమయినను, విరాళములు ఇచ్చు వారు, క్రింద తెలియ బర్చిన సమాచారం ప్రకారం, అన్న సమారాధన కమిటీ ని కూడా సంప్రదించ వచ్చు.

సమాచారం ఇచ్చినవారు

గ్రామ పెద్దలు

గుడి ఉన్న ప్రదేశము - గూగుల్ మ్యాప్ నందు:
స్థానం: https://maps.google.com/?q=16.329824,81.032074

ఎవరైనను దూరప్రాంతములనుండి వచ్చునపుడు, ఏదైన గుడి సమాచారము తెలుసుకొనుటకు, దేవుడు భద్రయ్య గారి వంశస్తులు, మండా రాంబాబు (99498 62213) గారికి ఫోన్ చేసి వచ్చుట మంచిది. వారు మీకు కావలసిన విధముగా ఏర్పాట్లు చేయ గలరు.
www.veerammathalli.in అను వెబ్ సైటు ప్రారంభించ బడినది. ఈ సైటు నందు అన్న దాన విరాళము ల సమాచారము కూడా తెలియును.

యూట్యూబ్ లింకు:

Visitors